September 12, 2026

Follow Us

Advertisement

About

Contact

image

60% OFF

Kitchen Appliances

కోదాడ ప్రమాద మృతులకు పవన్ కళ్యాణ్ సంతాపం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం

ఏపీ శాసనమండలిలో డీఎస్సీపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది. డీఎస్సీపై చర్చకు వైసీపీ నేతలు పట్టుబడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు(సోమవారం) ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ప్రశ్నోత్తరాలతో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌ రాజు సభా కార్యకలాపాలు మొదలుపెట్టారు. సభ మొదలైన వెంటనే డీఎస్సీ అక్రమాలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో.. పోడియం వద్ద ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు.

వైసీపీ రాష్ట్ర దూదేకుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దస్తగిరి

సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడేవారిని గుర్తించడంలో ఎప్పుడూ ముందుంటుంది. వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు, జర్నలిస్ట్, షేక్ దస్తగిరిని పార్టీ రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పిన్న వయసులోనే ఇటువంటి కీలకమైన రాష్ట్రస్థాయి బాధ్యత దక్కడం పట్ల వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మగౌరవ పోరాటాల దస్తగిరి: పోరాటమే ఊపిరిగా..
షేక్ దస్తగిరి పేరు వినగానే గుర్తుకువచ్చేది ఆయనలోని ప్రజా పోరాట పటిమ. చిన్నతనం నుంచే సామాజిక స్పృహ కలిగి, నూర్ బాషా/దూదేకుల వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన గళమెత్తారు. వెనుకబడిన వర్గాల హక్కుల సాధన కోసం, దూదేకుల సామాజిక వర్గ ఆత్మగౌరవం కోసం ఆయన రాజీలేని పోరాటాలు చేశారు.

అణగారిన వర్గాల సంక్షేమం కోసం దస్తగిరి చేపట్టిన నిరాహార దీక్షలు, నిర్వహించిన పోరాట వేదికలు ఆయనలోని పట్టుదలను, ప్రజా నిబద్ధతను చాటిచెప్పాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్షలకు దిగిన తీరు ఆయనలోని చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది.

జగన్ దృష్టిని ఆకర్షించిన నిబద్ధత
పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి తగిన గుర్తింపు లభిస్తుందనడానికి దస్తగిరి నియామకమే ఒక ఉదాహరణ. దూదేకుల సామాజిక వర్గ సంక్షేమానికి ఆయన పడిన తపన, జరిపిన ఉద్యమాలు వైయస్ఆర్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టిని ఆకర్షించాయి.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గంతో పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, దూదేకుల సామాజిక వర్గ ప్రతినిధులు దస్తగిరిని కలిసి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

సమర్థవంతమైన నాయకత్వంతో కొత్త శకం
షేక్ దస్తగిరి నాయకత్వంలో వైయస్ఆర్సీపీ నూర్ బాషా/దూదేకుల విభాగం మరింత క్రియాశీలకంగా మారనుందనడంలో సందేహం లేదు. చిన్న వయసులోనే ఈ స్థాయి ప్రాతినిధ్యం పొందిన దస్తగిరి, రాబోయే రోజుల్లో పార్టీ పరంగానూ మరియు సామాజికంగానూ తన ముద్ర వేస్తూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దస్తగిరి శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ..
"నన్ను నమ్మి ఈ చిన్న వయసులోనే రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన మన ప్రియతమ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని,. నూర్ బాషా, దూదేకుల సామాజిక వర్గాల సంక్షేమం కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని మూలమూలలా ఉన్న నూర్ బాషా సోదరులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కిందకు తెచ్చి, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తాను."

ఉండి రాజకీయంలో కొత్త అధ్యాయం: 2029 టార్గెట్..

పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ‘ఉండి’ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన పోరాటాలకు వేదికయ్యే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మంతెన యోగేంద్రబాబు శైలి, ఆయన అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి.

బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ సమయంలోనే క్షేత్రస్థాయిలో పార్టీకి సరికొత్త ఊపిరి ఊదడంలో యోగేంద్రబాబు సఫలమవుతున్నారనే అభిప్రాయం కేడర్‌లో వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో ఉత్సాహవంతమైన నాయకత్వం, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఆయన శైలిపై ప్రత్యేక విశ్లేషణ.

క్షేత్రస్థాయికి పార్టీ కార్యచరణ: వేగవంతమైన అడుగులు

ఏ రాజకీయ పార్టీకైనా నాయకత్వ మార్పు జరిగినప్పుడు క్షేత్రస్థాయి కేడర్‌ను సమాయత్తం చేయడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఉండి నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. యోగేంద్రబాబు ఇన్ ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు నుంచే పార్టీ కార్యక్రమాల్లో గమనాన్ని పెంచారు.

  • గ్రామ స్థాయి భేటీలు: నియోజకవర్గంలోని ప్రతి మండలం, గ్రామంలో పర్యటిస్తూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో నేరుగా సమావేశమవుతున్నారు.

  • కార్యకర్తలకు భరోసా: గత ఎన్నికల తదనంతర పరిణామాలతో కొంత నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు నేరుగా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.

  • ప్రజా సమస్యలపై పోరాటం: స్థానిక సమస్యలను గుర్తించి, ప్రజల పక్షాన గళమెత్తేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

యువతతో మమేకం: మారిన రాజకీయ వ్యూహం

నేటి రాజకీయాల్లో యువత పాత్ర అత్యంత కీలకమైంది. ఈ విషయాన్ని సరిగ్గా గుర్తించిన యోగేంద్రబాబు, తన పర్యటనల్లో యువతను భాగస్వాములను చేయడానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.

ఆయన స్వయంగా యువకుడు, ఉత్సాహవంతుడు కావడం వల్ల స్థానిక యువత ఆయనతో సులభంగా మమేకం కాగలుగుతోంది. డిజిటల్ మాధ్యమాలు, ముఖాముఖి సమావేశాల ద్వారా యువతరం ఆలోచనలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తున్నారు. క్రీడా పోటీలు, యువజన సమావేశాల ద్వారా యంగ్ జనరేషన్‌ను పార్టీ వైపు ఆకర్షించేందుకు ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రస్తుత రాజకీయ సమీకరణాలు: ఎమ్మెల్యే రఘురామ వర్సెస్ యోగేంద్రబాబు

ప్రస్తుతం ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ డిప్యూటీ స్పీకర్, శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకున్న రాజకీయ అనుభవం, మీడియా కవరేజ్, ప్రచార శైలికి సరిజోడుగా క్షేత్రస్థాయిలో గట్టి పోటీనిచ్చే నాయకత్వం కోసం వైఎస్సార్‌సీపీ చూస్తున్న తరుణంలో యోగేంద్రబాబు రాక ఆ లోటును భర్తీ చేసినట్లయింది.

రఘురామకృష్ణంరాజు వంటి సీనియర్ నాయకుడిని ఎదుర్కోవాలంటే కేవలం మైక్ ముందు మాట్లాడటం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రతి ఇల్లు తిరిగే ఓర్పు, జనంతో మమేకమయ్యే ఉత్సాహం అవసరం. యోగేంద్రబాబు సరిగ్గా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రఘురామకృష్ణంరాజు అనుభవానికి, యోగేంద్రబాబు యువ రక్తం, వేగానికి మధ్య సాగుతున్న ఈ రాజకీయ సమరం ఉండిలో ఆసక్తికరంగా మారింది.

ప్రజాభిప్రాయం: వచ్చే ఎన్నికల్లో జెండా ఎగిరేనా?

ఉండి నియోజకవర్గ ప్రజా బాహుళ్యంలో, రాజకీయ విశ్లేషకుల్లో ఇప్పుడు ఒకటే చర్చ సాగుతోంది. యోగేంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చూపిస్తున్న ఇదే స్పీడ్‌ను, పట్టుదలను చివరి వరకు కొనసాగిస్తే... వచ్చే ఎన్నికల్లో ఉండిలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడం ఖాయమనే ధీమా కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

స్థానిక ప్రజల నుంచి వస్తున్న స్పందన, తటస్థుల నుంచి లభిస్తున్న మద్దతు పార్టీకి సానుకూల అంశాలుగా మారుతున్నాయి. నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ, ప్రజా సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి.

విశ్లేషణ: యోగేంద్రబాబు ముందున్న సవాళ్లు

యోగేంద్రబాబు ఆరంభ శూరుడిగా కాకుండా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో గెలుపు తీరాలకు చేరాలంటే కొన్ని కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది:

  1. నాయకుల మధ్య సమన్వయం: నియోజకవర్గంలోని పాత, కొత్త నాయకత్వాల మధ్య పూర్తిస్థాయి సమన్వయాన్ని సాధించడం.

  1. స్థిరమైన కార్యాచరణ: ఈ ఉత్సాహాన్ని, వేగాన్ని ఎన్నికల వరకు ఏమాత్రం తగ్గకుండా నిలబెట్టుకోవడం.

  1. బూత్ స్థాయి నెట్‌వర్క్: ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో బలమైన కార్యకర్తల సైన్యాన్ని సిద్ధం చేసుకోవడం.

యోగేంద్రబాబు రాకతో ఉండి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీలో కొత్త అధ్యాయం ప్రారంభమైందనడంలో సందేహం లేదు. ఆయన చూపిస్తున్న చురుకుదనం, యువతతో అనుబంధం, ప్రతికూల పరిస్థితుల్లోనూ చూపిస్తున్న తెగువ పార్టీకి కొత్త ఊపునిచ్చాయి. ఈ జోరును ఇలాగే కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే, రాబోయే ఎన్నికల్లో ఉండి గడ్డపై వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అణగారిన గొంతుకల ఆత్మగౌరవం కల్వకుంట్ల కవిత..!

సామాజిక న్యాయం కేవలం మాటల్లో కాకుండా, చేతల్లో చూపించినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యమవుతుంది..తెలంగాణ గడ్డపై బహుజన, అణగారిన వర్గాలకు రాజకీయ అధికారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం ఇందుకు నిలువెత్తు రూపం.. మంచిర్యాల జిల్లాకు చెందిన దళిత నిరుపేద మహిళ అవునూరి శ్రీవాణి గారి జీవితంలో జరిగిన సంఘటన ఇందుకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది.

మంచిర్యాల జిల్లా, లక్ష్యెట్పేట మండలం, గుల్లకోట గ్రామానికి చెందిన అవునూరి శ్రీవాణి గారు ఒక సాధారణ దళిత నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ.

గడిచిన సర్పంచ్ ఎన్నికలలో గుల్లకోట గ్రామం నుండి ఆమె ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ గ్రామానికి చెందిన సంప్రదాయ రాజకీయ నాయకులు ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. "నీకు ఆర్థిక బలం లేదు, నువ్వు అణగారిన వర్గానికి చెందిన దళిత మహిళా" అంటూ అనేక రకాలుగా అవమానాలకు గురి చేసి , ఆమె సర్పంచ్ గా గెలవకుండా అడ్డుకున్నారు. ఆర్థిక, సామాజిక కారణాలరీత్యా ఆమె తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నారు. సమాజంలో సమూల మార్పు రావాలనే బలమైన ఆకాంక్షతో శ్రీవాణి గారు రగిలిపోయారు..

అదే సమయంలో కల్వకుంట్ల కవిత గారు "సామాజిక తెలంగాణ" సిద్ధాంతంతో పార్టీని స్థాపించారు..అన్ని కులాలకు సమానమైన హక్కులు, గౌరవం దక్కుతాయనే బలమైన నమ్మకంతో శ్రీవాణి గారు కవితమ్మ గారి సిద్ధాంతాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీలో చేరారు. కల్వకుంట్ల కవితమ్మ గారు తన మొదటి దశ బాయి బాట పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 'ఊరూరా జెండా పండుగ' నిర్వహిస్తున్న సమయంలో, శ్రీవాణి గారు తన గ్రామంలో టీఆర్ఎస్ జెండా గద్దెను నిర్మించుకుని ఒక ఫోన్ మెసేజ్ ద్వారా కవితమ్మను ఆహ్వానించారు.. ఏ గ్రామంలో అయితే శ్రీవాణి గారు వివక్ష ఎదుర్కుందో, అదే చోట కవితమ్మ గారి చేతుల మీదుగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి స్థానిక నాయకులకు సవాల్ విసిరారు.

ఆ జెండా ఆవిష్కరణ ద్వారా సామాజిక తెలంగాణ సాధన కోసం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం కవితమ్మ ఏ స్థాయిలో నిలబడుతున్నారనే స్పష్టమైన సంకేతం సమాజానికి వెళ్ళింది…

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వేలాది మంది జనసందోహం మధ్య నిర్వహించిన సామజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలో అవునూరి శ్రీవాణి గారికి మాట్లాడే అవకాశం కల్పించి తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు

అణగారిన గొంతుకలకు వేదికపై పెద్దపీట వేయడమే నిజమైన సామాజిక న్యాయమని, దీనికి కవితమ్మ గారు పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నారనడానికి శ్రీవాణి గారి ఉదంతమే నిదర్శనం.

మాటల రాజకీయాలకు భిన్నంగా, అణగారిన వర్గాల మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడంలో, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంలో కల్వకుంట్ల కవిత గారి నాయకత్వం అసాధారణమైనది. అవునూరి శ్రీవాణి గారి అనుభవం సామాజిక తెలంగాణ సాధనలో కవితమ్మ గారి సంకల్ప బలాన్ని చాటిచెప్పే చారిత్రక సత్యం.

జగన్ సారధ్యంలో జాతికోసం మరింతగా..!

పిన్న వయసులోనే జాతికోసం ఆలోచించాడా యువకుడు.. రాష్ట్రస్థాయి జర్నలిస్టుగా, మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్న తరుణంలోనే కెరీర్ ను పణంగా పెట్టి కులం కోసం నడుంబిగించాడు.. 2018లో ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల పొలిటికల్ జేఏసీ స్థాపించాడు.. దూదేకుల ముస్లింలకు సరైన గుర్తింపు గౌరవం దక్కడం లేదని గొంతెత్లి నినదించాడు.. అమరావతిలో పొలిటికల్ జేఏసీ ప్రారంభించి అక్కడే కార్యాలయాన్ని నెలకొల్పాడు.. 2019 ఎన్నికల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, దూదేకుల సమాజానికి తన ఉద్దేశాన్ని బలంగా చాటిచెప్పాడు..

ఉన్నత వర్గాల్లోని రాజకీయ కుటుంబాల్లో ఒకే కుటుంబం లో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు లు ఉండొచ్చు కానీ వెనుకబడిన, విస్మరించబడిన దూదేకుల జాతినుండి ఒక్క ఎమ్మెల్యే ఉండకూడదా అని ప్రశ్నించాడు.. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడమే కాదు.. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ నినాదాన్ని వదిలిపెట్టలేదు.. ప్రధాన మీడియా చానెళ్లలో డిబేట్లు, పత్రికల్లో వార్తలు ఊపందుకున్నాయి. దూదేకుల కులం గురించి సర్వత్రా చర్చించుకున్నారు. కేవలం దస్తగిరి అనే యువకుడు నడుం బిగించడం వల్లే..కేవలం రాజకీయ అజెండానే కాదు దూదేకుల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసాడు.. దూదేకుల కులం ఎదుర్కుంటున్న అసభ్య పదాలను తొలగిస్తూ జీవో తెచ్చిన ఘనత దస్తగిరిదే.. అసలు దూదేకుల కమ్యూనిటీ పేరుతో జివో రావడమే మొదటిది..

దస్తగిరి పోరాటాన్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా నియమించింది. పార్టీలో చేరిన వెనువెంటనే వైసీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పదవి సాధించాడు.. దస్తగిరి చేస్తున్నది రాజకీయ పోరాటమే, దూదేకుల ఉనికిని బ్రతికించడమో కాదు.. అధికారంలో భాగస్వామ్యం, ఆత్మగౌరవ పోరాటం.. దూదేకులంటే ముస్లిం సమాజంలోని ఒక వర్గం కాదు రాష్ట్రంలోని ప్రధాన కులాల్లో మాదీ సింహభాగమేనన్న గుర్తింపు.. చిన్న వయసునుండే పోరాటాలు, కులం కోసం ఉద్యమాలు చేపట్టిన దస్తగిరి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, జాతికోసం మరింత వేగంగా అడుగులు వేయాలని యావత్ దూదేకుల సమాజం ఆశిస్తోంది.. ఆశీర్వదిస్తోంది..

కాకినాడ ప్రమాదంపై దస్తగిరి దిగ్బ్రాంతి..

కాకినాడ జిల్లా బాణసంచా కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదంపై వైసీపీ నేత దస్తగిరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.. ఈ భారీ పేలుడు విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు ధ్వంసం కావడం అత్యంత విషాదకరమన్నారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించాలని, గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని కోరారు.

ఉప ప్రధానిగా చంద్రబాబు !!?

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతల నుండి తప్పుకుని ఆ పగ్గాలను తన కుమారుడు నారా లోకేష్ చేతుల్లో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో ఈ మార్పు సహజంగానే జరుగుతుందని అంతా భావిస్తున్నారు. ఈ విషయంలో కూటమిలోని మరో ప్రధాన నేత పవన్ కళ్యాణ్ కు కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రచారం జరుగుతోంది. లోకేష్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం కేవలం సమయం కోసమే వేచి చూస్తున్న ప్రక్రియలా కనిపిస్తోంది. బహుశా రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి ఈ అధికార మార్పిడి జరిగి లోకేష్ రాష్ట్ర పీఠాన్ని అధిరోహించే అవకాశం ఉంది.

చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల వైపు అడుగులు వేయడం

రాష్ట్ర రాజకీయాల నుండి తప్పుకున్నాక చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఆయన కేవలం ఒక సాధారణ కేంద్ర మంత్రిగా ఉండాలని అనుకోవడం లేదు. భారత ప్రభుత్వంలో ఉప ప్రధాని పదవిని దక్కించుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వంలో అద్వానీ లాంటి నాయకులు నిర్వహించిన ఈ హోదాను తాను కూడా పొంది తన రాజకీయ ప్రస్థానాన్ని గౌరవప్రదంగా ముగించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలుగుదేశం మద్దతుపై ఆధారపడి ఉండటంతో ఈ డిమాండ్ ను కేంద్రం ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ పదవిని దక్కించుకోవడానికి ఆయన కేవలం రాజకీయ మార్గాలనే కాకుండా వ్యాపారవేత్తలు అలాగే వివిధ రంగాల ప్రముఖుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంబానీ మరియు అదానీ వంటి పారిశ్రామిక వేత్తలతో ఉన్న పాత పరిచయాలను ఈ దిశగా వాడుకుంటూ కేంద్ర పెద్దలను ఒప్పించే పనిలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది.

అయితే చంద్రబాబు నాయుడు అంచనాలకు కేంద్రంలోని బిజెపి నాయకత్వం ఎంతవరకు తలొగ్గుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. గతంలో ఆయన ఎన్డీయే నుండి బయటకు వెళ్ళిన తీరును దృష్టిలో పెట్టుకుని కేంద్ర పెద్దలు ఆయనను పూర్తిగా నమ్మడం లేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆయనను ఉప ప్రధానిగా తీసుకోవడం కంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ గా పంపాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు కూడా ఒక వాదన ఉంది. కానీ చంద్రబాబు మాత్రం గవర్నర్ పదవికి వెళ్ళడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. రాబోయే పది పదిహేను ఏళ్లు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. తన కుమారుడికి రాష్ట్రంలో లైన్ క్లియర్ చేసి తాను ఢిల్లీలో కీలకమైన బాధ్యతలు చేపట్టడం ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని ఆయన చూస్తున్నారు. ఒకవేళ ఉప ప్రధాని పదవి దక్కకపోతే రాజ్యసభ చైర్మన్ లేదా ఉప రాష్ట్రపతి పదవి అయినా సాధించాలని ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన మలుపులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

వరకట్న వేధింపులు.. కాపురానికి వెళ్లిన మహిళపై భర్త కుటుంబసభ్యుల దాడి!

కృష్ణా జిల్లా, నందివాడ మండలం, తరిమిస గ్రామంలో ఓ మహిళపై భర్త కుటుంబసభ్యులు దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన విజయలక్ష్మిపై ఆమె భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి తీవ్రంగా దాడి చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరుకు చెందిన విజయలక్ష్మిని తరిమిస గ్రామానికి చెందిన రఘునాథ్ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తూ, అనేకసార్లు తనపై దాడులు చేశారని విజయలక్ష్మి ఆరోపిస్తోంది. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు సంధి జరిగినప్పటికీ, భర్త రఘునాథ్, అతని తల్లి శ్రీవల్లి వేధింపులు కొనసాగించారని తెలిపింద
ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా విజయలక్ష్మి తన తల్లిదండ్రుల వద్దే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో రేపల్లెలో నివసిస్తున్న రఘునాథ్ అన్నయ్య ఫోన్ చేసి, “ఇకపై వేధింపులు ఉండవు, జాగ్రత్తగా చూసుకుంటాం” అంటూ కాపురానికి రావాలని కోరడంతో, నిన్న తన భర్త ఇంటికి వెళ్లినట్లు తెలిపింది.

అయితే అక్కడికి వెళ్లిన వెంటనే “నిన్నెవరు రమ్మన్నారు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు డబ్బులు కావాలి” అంటూ భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి తీవ్రంగా దూషించి, కర్రలతో విజయలక్ష్మిపై, ఆమె తండ్రి గోవింద రాజాచార్యులపై దాడి చేశారని ఆరోపించింది. అంతేకాకుండా తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొంది.

దాడిలో తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు మెడికల్ లీగల్ కేసు (MLC)గా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తనపై, తన తండ్రిపై దాడి చేసిన భర్త రఘునాథ్, అత్త శ్రీవల్లి పై కఠిన చర్యలు తీసుకోవాలని విజయలక్ష్మి డిమాండ్ చేస్తోంది.

TOP